
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -అమలాపురం, అక్టోబర్ 2:
బాణాసంచా తయారీ, నిల్వ కేంద్రాలపై రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ఆదేశించారు. ఇటీవల పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం విలస గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం బాధాకరమని, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అన్ని శాఖల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ ఘటన నేపథ్యంలో, కలెక్టర్ రెవెన్యూ, పోలీస్, ఫైర్ శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో బాణాసంచా తయారీ, నిల్వ కోసం మంజూరు చేసిన లైసెన్సులు, వాటి రెన్యూవల్ వివరాలను సమర్పించాలని ఆదేశించారు.
సంబంధిత శాఖల సిబ్బంది తమ పరిధిలోని బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాలను తనిఖీ చేయాలని, రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లైసెన్సు పొందిన ప్రదేశంలోనే నిల్వ ఉంచుతున్నారా లేదా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు. ముఖ్యంగా, ఎవరైనా నివాస గృహాలలో బాణాసంచా నిల్వ ఉంచినట్లయితే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని అధికారులను ఆదేశించారు.