V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు – అమరావతి మార్చి 09:
నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు 25 మంది పోటీ పడుతున్నారు.
ఎమ్మెల్యే కోటా ఐదింటిలో ఒక స్థానాన్ని మిత్రపక్షం జనసేనకు కేటాయించారు.
ఆ పార్టీ తరపున కొణిదెల నాగబాబు నామినేషన్ కూడా వేశారు. మిగతా నాలుగు స్థానాల కోసం తెదేపాలో తీవ్ర పోటీ నెలకొంది. సుమారు 25 మంది పదవులు ఆశిస్తున్నారు. సీరియస్ గా ప్రయత్నిస్తున్నవారు 10 మంది వరకు ఉన్నారు. కొందరు నేరుగా వెళ్లి అధినేత చంద్రబాబు, మంత్రి లోకేశ్ను అడుగుతుండగా, మరికొందరు తమకు మద్దతుగా ఇతర నాయకులను తీసుకెళ్లి అడిగిస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి చాలా సేవ చేశామని, గట్టిగా నిలబడ్డామని చెబుతూ.. అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీల్లోనూ కొందరు మళ్లీ అవకాశమివ్వమని అడుగుతున్నారు. కచ్చితంగా తమకు అవకాశం వస్తుందన్న నమ్మకంతో కొందరు నాయకులు నామినేషన్ వేసేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇంటికెళ్లే ఎమ్మెల్సీలు,
తెదేపా ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, అశోక్బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావుల పదవీ కాలం ఈ నెల 29తో ముగుస్తోంది. జంగా కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. 2024 మే 15 నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. ఈ ఐదు స్థానాలకు ఇప్పుడు ఎన్నిక జరుగుతోంది. వీరిలో అశోక్ బాబు, బీటీ నాయుడు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తి తమకు మళ్లీ అవకాశమివ్వమని కోరుతున్నారు. ఇంకా ఆశావహుల్లో దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ (పిఠాపురం), కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర, కేఎస్ జవహర్, బుద్ధా వెంకన్న, మోపిదేవి వెంకటరమణ, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, ఏరాసు ప్రతాప్రెడ్డి, రెడ్డి సుబ్రహ్మణ్యం, మల్లెల లింగారెడ్డి, తిప్పేస్వామి, ప్రభాకర్ చౌదరి, పరసా రత్నం, ఏఎస్ రామకృష్ణ, మంతెన సత్యనారాయణరాజు, రుద్రరాజు పద్మరాజు, మహ్మద్ నజీర్, నాగుల్మీరా తదితరులున్నారు. గత ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసినవారిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తదితరుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.