
తమ రాజకీయ కుల దురహంకారంతోనే మండలంలోని వెలువలపల్లికి చెందిన దళిత యువకుడు దోనిపాటి మహేశ్వరరావుపై దాడి జరిగినట్లు మానవహక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యేడిద రాజేష్ తెలిపారు.ఈ విషయమై మానవ హక్కుల వేదిక రాష్ట్ర, జిల్లా బాధ్యులు బుధవారం మహేశ్వర రావు తో మాట్లాడి నిజనిర్ధారణ చేసారు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలపై వారు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక అంశాలలో తలెత్తిన వివాదంలో నిందితులు చట్టబద్ధ విధానాలను విస్మరించి దాడులకు తెగబడటం అమానుషమని అన్నారు. మహేశ్వర రావును నిందితులు ముందస్తు ప్రణాళికతో ఆటోలో పలుచోట్ల కు తిప్పుతూ దాడిచేసారని అన్నారు. ఈ విషయమై పోలీసు విచారణ రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా నిష్పక్ష పాతంగా చేయాలని డిమాండ్ చేశారు.రాజకీయ ప్రాబల్యంతో చట్టవ్యతిరేఖంగా వివాదాలను పరిష్కరించే ధోరణి ప్రబలిందని అన్నారు. ఈ పరిస్థితి ప్రజలకు వ్యవస్థలపై నమ్మకాన్ని సడలిపోయేలా చేస్తుందని చెప్పారు. ఇది చట్టబద్ధ పాలనకు వాంఛనీయం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఆర్ఎఫ్. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.రవి జిల్లా అధ్యక్షుడు ఎండి. ఇక్బాల్ కార్యవర్గ సభ్యుడు పవన్ తదితరులు పాల్గొన్నారు.