ఒక్కో క్షతగాత్రునికి రూ 3 వేలు ఆర్థిక సహాయం
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు -రామచంద్రపురం ఫిబ్రవరి 22:
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలుకు ఆదేశాలుకాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం పై ఆరా
రామచంద్రపురం, ఫిబ్రవరి 22: రామచంద్రపురం మండలం వేగాయమ్మ పేట సమీపంలో వ్యాను బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన సుమారు 45 మందిని రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. రోడ్డు ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే తన తండ్రి వాసంశెట్టి సత్యంను అప్రమత్తం చేసి తక్షణ వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తన కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కువచ్చి, కూటమి నాయకులతో కలిసి పరామర్శించారు. శనివారం తోటపేట నుంచి కె.గంగవరం మండలం మసకపల్లి గ్రామానికి ఒక శుభకార్యం నిమిత్తం 40 మంది మహిళలు, 5 గురు పురుషులు ప్రైవేట్ వ్యానులో బయలుదేరగా, వ్యాను వేగాయమ్మపేట వద్దకు చేరుకోగానే వ్యాన్ వెనుక యాక్సిల్ భాగం విరిగిపోవడంతో వ్యాన్ బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆ వ్యానులో 40 మంది మహిళలు, 5 గురు పురుషులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ కు వెళ్లి ఆసుపత్రి సూపరిండెంట్ డా. ప్రవీణ్ తో కలిసి ప్రమాద సంఘటన జరిగిన తీరు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఇదొక దురదృష్టకర సంఘటన అన్నారు. క్షతగాత్రులు ఆసుపత్రికి చేరుకోక ముందే తన తండ్రి వాసంశెట్టి సత్యం, తన అనుచరులతో ఏరియా ఆసుపత్రికి చేరుకొని బాధితులకు వైద్య బృందాన్ని అప్రమత్తం చేసి సకాలంలో వైద్య సేవలు అందేలా చేయటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొంతమందిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో అక్కడ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ లావణ్య కుమారిని మంత్రి సుభాష్ ఆదేశించారు. మిగిలిన క్షతగాత్రులకు ప్రాణాపాయం లేదని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ ప్రవీణ్ మంత్రి సుభాష్ కు వివరించారు. సకాలంలో వైద్య సేవలు అందించిన వైద్య బృందాన్ని మంత్రి సుభాష్ అభినందించారు. మంత్రి వెంట ఆయన తండ్రి, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, జనసేన ఇన్చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, కూటమి నాయకులున్నారు.
ఒక్కో క్షతగాత్రునికి రూ 3 వేలు ఆర్థిక సహాయం
రోడ్డు ప్రమాదంలో గాయపడి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక్కో బాధితునికి రూ.3 వేలు చొప్పున రూ.1.2 లక్షలు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం గారు ఆర్థిక సహాయం అందించారు. సాటి మనిషిగా కష్ట కాలంలో ఉన్న క్షతగాత్రులకు ట్రస్ట్ తరఫున ఆర్థిక సహాయం అందించడం పట్ల క్షతగాత్రులు ఆనందం వ్యక్తం చేశారు. సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా పలువురు ప్రసంశించారు.
