
భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు
V9 ప్రజా ఆయుధం దినపత్రిక ఆన్ లైన్ వార్తలు –
అమలాపురం, జూన్ 6, 2025

అయినవిల్లి తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మను పరామర్శించిన జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్
దాడి చేసిన నిందితుడిపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు
అయినవిల్లి మండలం తహసిల్దార్ సీ హెచ్ నాగలక్ష్మమ్మ పై జరిగిన దాడి ఘటన పై డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయినవిల్లి మండలం తొత్తరమూడి శివారు జోగిరాజుపాలెం గ్రామానికి చెందిన వ్యక్తి మీసాల సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం తహసిల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించి, తహసిల్దార్ సిహెచ్. నాగలక్ష్మమ్మ పై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ తహసిల్దార్కి ఫోన్ చేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె ఎడమ చేతి పై చిన్న గాయం అయిందని కలెక్టర్ కి తెలిపారు.ఆమె త్వరగా కోలుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విధి నిర్వహణలో నిమగ్నమైన అధికారిపై అలాంటి దాడి జరగడం బాధాకరమని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, నిందితుడిపై భారతీయ న్యాయ స్మృతి (భారత న్యాయ సాంహిత – BNS)లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP)ను కలెక్టర్ ఆదేశించారు. అయినవిల్లి సబ్ ఇన్స్పెక్టర్ నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఆమెకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తోందని కలెక్టర్ స్పష్టం చేశారు.